(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ వ్యతిరేక వార్తలను ప్రచురించే మీడియా సంస్థలపై కేంద్రంలోని మోదీ సర్కారు కత్తిగట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ప్రకటనల కోసం రూ.6,509 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయగా, ఇందులో సింహభాగం తమకు అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తున్న సంస్థలకే కట్టబెట్టింది.
బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రసారం చేస్తున్న ప్రముఖ మీడియా గ్రూప్లు దైనిక్ భాస్కర్, ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థలకు ఇచ్చే ప్రకటనలకు అడ్డగోలుగా కత్తెర వేసింది. ఇదే సమయంలో ప్రధాని మోదీకి సన్నిహితులైన ముఖేశ్ అంబానీకి చెందిన నెట్వర్క్18 గ్రూప్, ఎస్సెల్ గ్రూప్ చైర్పర్సన్ సుభాశ్చంద్రకు చెందిన జీ గ్రూప్, బీజేపీకి అనుకూలంగా వార్తలను ప్రసారం చేసే దైనిక్ జాగరన్, టైమ్స్ గ్రూప్నకు ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలను కట్టబెట్టింది.
ఆ వార్తలు ప్రసారం చేసినందుకే..
ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్కు 2020-21తో పోలిస్తే 2021-22లో ప్రకటనల్లో కేంద్రం 47 శాతం కోత విధించింది. 2020-21లో దైనిక్ భాస్కర్కు రూ.5.95 కోట్ల విలువైన యాడ్స్ను ప్రభుత్వం ఇవ్వగా, ఆ మరుసటి ఏడాది ఇది రూ.3.15 కోట్లకు తగ్గిపోయింది. ఇదే గ్రూప్నకు చెందిన గుజరాతీ పత్రిక దివ్యభాస్కర్కు ఇచ్చే ప్రకటనలను కూడా రూ.1.07 కోట్ల నుంచి రూ.68 లక్షలకు తగ్గించింది.
కొవిడ్ రెండో వేవ్ సంక్షోభాన్ని తిప్పికొట్టడంలో, రోగులకు ఆక్సిజన్ సరఫరాలో బీజేపీ సర్కారు విఫలమైందని, ఫలితంగా లక్షల మంది మృత్యువాత పడ్డారని దైనిక్ భాస్కర్ గ్రూప్ పలు కథనాలను ప్రసారం చేసింది. ఈ కారణంగానే ఆ మీడియా గ్రూప్నకు కేంద్రం ప్రకటనల్లో కోత విధించిందని సంబంధిత రంగానికి చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.