పొరుగు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలని దాదాపు మూడు వేల మంది భారత జవాన్లు ఆత్మబలిదానం చేసిన త్యాగానికి గుర్తు ఆ జ్యోతి. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లుగా నిర్విఘ్నం గా ప్రజ్వరిల్లుతున్న చరిత్ర దాని సొంతం. జాతి ఆత్మను, సైనిక త్యాగ నిరతిని నింపుకొన్న ఆ అఖండ దీపాన్ని కేంద్రం ఆర్పేస్తూ తమ హయాంలో కొత్తగా నిర్మించిన మరో స్మారకం ముందున్న జ్యోతిలో దాన్ని కలిపేసింది. ఈ చర్యను చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది. కేంద్రం ఏకపక్ష నిర్ణయంపై ప్రతిపక్షాలు సహా మాజీ సైన్యాధికారులు మండిపడ్డారు.
న్యూఢిల్లీ, జనవరి 21: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గత 50 ఏండ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర జవాన్ జ్యోతిని ఇండియా గేట్కు మరో పక్కన ఉన్న ‘జాతీయ యుద్ధ స్మారకం’ (ఎన్డబ్ల్యూఎమ్) వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమాన్ని చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ పర్యవేక్షించారు. ఇదో చారిత్రక ఘట్టమని కేంద్రప్రభుత్వం అభివర్ణించింది. ఎన్డబ్ల్యూఎమ్ వద్ద ఉన్న జ్యోతిలో అమర జవాన్ జ్యోతి విలీనమైనట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు. అమర జవాన్ జ్యోతి ఇకపై ఉండబోదని, త్వరలో ఆర్పివేయనున్నట్టు తెలిపారు. అమర జవాన్లకు నివాళులు అర్పించాలనుకొనేవారు ఇకపై ఎన్డబ్ల్యూఎమ్ వద్ద ఉన్న శాశ్వత జ్యోతి వద్దకే రావాలని సూచించారు. అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పివేయనుండటంపై కాంగ్రెస్ మండిపడింది. చరిత్రను చెరిపేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని విమర్శించింది. ‘కొంతమందికి దేశభక్తి, త్యాగనిరతి ఎన్నటికీ అర్థంకావు’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అమర జవాన్ జ్యోతిని కాంగ్రెస్ తిరిగి మళ్లీ వెలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆ జ్యోతిని చూస్తూనే పెరిగాం
అమర జవాన్ జ్యోతిని ఎన్డబ్ల్యూఎమ్ జ్యోతిలో విలీనం చేయడంపై మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘సర్, ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతి భారతీయుల ఆత్మను ప్రతిబింబిస్తుంది. మీరు, నేను, మన తరం ధైర్యవంతులైన అమర జవాన్లకు వందనాలు తెలియజేస్తూ.. ఈ జ్యోతిని చూస్తూనే పెరిగాం. ఎన్డబ్ల్యూఎమ్ కూడా గొప్పదే. అయితే, అమర జవాన్ జ్యోతి స్మృతులు ఎన్నటికీ చెరిగిపోనివి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ మాలిక్ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు.
విలీనం చేస్తున్నామంటూనే..
అమర జవాన్ జ్యోతిని ఆర్పివేయబోతున్నారంటూ శుక్రవారం ఉదయం వార్తలు రావడంతో దీనిపై పెద్దఎత్తున వివాదం రేగింది. దీంతో కేంద్రప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చిచ్చాయి. ‘అమర జవాన్ జ్యోతిని ఆర్పివేయట్లేదు. ఈ జ్యోతిలోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నాం. ఇండియా గేట్ వద్ద ఉన్న 1971 నాటి స్మారకంపై ఆ యుద్ధంలో అమరులైన జవాన్ల పేర్లు లేవు. కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకం వద్ద 1971 యుద్ధంలో అమరులైన సైనికులతో పాటు అనేకమంది వీర జవాన్ల పేర్లను లిఖించారు. అక్కడ కూడా ఈ జ్యోతి వెలిగితే అమర జవాన్లకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్టు అవుతుంది’ అని వివరించాయి. అయితే, జ్యోతి విలీనం కాగానే.. అమర జవాన్ జ్యోతిని త్వరలో ఆర్పివేస్తామని ఆర్మీ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ అమర జవాన్ జ్యోతి?
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారత్-పాక్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద ఓ స్మారకం నిర్మించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీని ముందు అమర జవాన్ జ్యోతిని వెలిగించారు. 2006 వరకు ఎల్పీజీ సాయంతో నిర్విరామంగా ప్రజ్వరిల్లిన ఈ జ్యోతి ప్రస్తుతం పీఎన్జీ సాయంతో వెలుగుతున్నది. ఇండియా గేట్కు మరోవైపున జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019లో నిర్మించారు. 1971లో అమరులైన జవాన్లతో పాటు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై ఇక్కడ లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ దీన్ని ఆవిష్కరించారు. అమర జవాన్ జ్యోతి వద్ద 1971 యుద్ధ జవాన్ల పేర్లు లేవని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద వారి పేర్లు ఉన్నందున జ్యోతిని స్థానచలనం చేయించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.