వైట్ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు భారతీయ రైల్వేశాఖ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతున్నది. ఇప్పటికే ఆ రైళ్లు వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను సరఫరా చేశాయి. తాజాగా జార్ఖండ్లోని టాటానగర్ నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఒకటి బెంగుళూరులోని వైట్ఫీల్డ్కు చేరుకున్నది. అయితే ఆ రైలులో మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డ్ .. అందరూ మహిళ ఉద్యోగులు కావడం విశేషం. వైట్ఫీల్డ్కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకు వచ్చింది. ఆరు బోగీలతో రైలు బెంగుళూరు చేరుకున్నది. భారతీయ రైల్వే శాఖ ఇప్పటి వరకు 13319 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను.. 814 ట్యాంకర్లలో.. 208 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా సరఫరా చేసింది.