న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమయింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, పియూష్ గోయల్, అర్జున్రామ్ మేఘవాల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు.
పార్లమెంటు సమావేశాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ ఏర్పాటుచేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్యసభా పక్ష నేతలతో చైర్మన్ వెంకయ్యనాయుడు భేటీ అవుతారు.