అహ్మదాబాద్, నవంబర్ 30: దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడుతలో 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు 14,382 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సహా 36 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలపగా, ఆప్ 88 స్థానాల్లో బరిలోకి దింపింది. ఒక అభ్యర్థి నామినేషన్ను విత్డ్రా చేసుకొన్నారు. బీఎస్పీ 57 మందిని నిలబెట్టింది. అటు.. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
త్రిముఖ పోరులో నెగ్గేదెవరు?
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోరుగా నిలిచాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, పునర్వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. చాపకింద నీరులా విస్తరించిన ఆప్..
అధికారమే లక్ష్యంగా బరిలో నిలిచింది.
బీజేపీ: ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టాలంటే గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి తీరాలి. సొంత రాష్ట్రంలోనే మోదీ-షా ద్వయానికి ఎదురుగాలి వీస్తే, ఆ ప్రభావం పార్టీపై జాతీయ స్థాయిలో పడుతుంది. అందుకే, మరోసారి అధికారాన్ని కాపాడుకొనేందుకు ఏకంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు. వరుస పర్యటనలు, లక్షల కోట్ల ప్రాజెక్టులతో గుజరాత్పై వరాలు కురిపించారు. అయితే, అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్: క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. ఇదే వ్యూహాన్ని ఆ పార్టీ గతంలోనూ ప్రయోగించింది. ఈ వ్యూహం ద్వారా ఓట్లను దక్కించుకోవచ్చని భావిస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులు పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రజలకు భారీ హామీలు ఇచ్చారు.
ఆప్: పంజాబ్లో గెలిచిన ఊపుతో గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్కు దీటైన పోటీ ఇస్తున్నది. ఢిల్లీ మాడల్ పాలనను చూపిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ పార్టీ కూడా ప్రజలను ఆకర్షించే పలు హామీలను ప్రకటించింది.
ప్రముఖుల పోటీ
ఈ విడతలో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాస్ గాఢ్వీ.. ఖంబాలియా సీటు నుంచి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్ నగర్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. ‘మోర్బీ’ బాధితులను కాపాడిన కాంతిలాల్ అమృతీయ, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నాయకుడు చోటు వాసవ.. జగదియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.