లక్నో : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది యూపీ కార్మికులను కాపాడటంలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని సిల్క్యార సొరంగంలో రాష్ట్రానికి చెందిన కార్మికులు చిక్కుకుంటే వారిని కాపాడాల్సాని సీఎం యోగి ఆదిత్యానాధ్ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు రప్పించడం బీజేపీ ప్రభుత్వ బాధ్యతని అఖిలేష్ గుర్తుచేశారు. ఈ ఆపద సమయంలో యూపీకి చెందిన ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలకు మనం అండగా ఉండాలని, మనం వారికి బాసటగా నిలిస్తే కార్మికుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని ట్విట్టర్ వేదికగా అఖిలేష్ రాసుకొచ్చారు.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కార్మికులను కాపాడే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు ఎనిమిది రోజులుగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల్లో ఎనిమిది మంది యూపీకి చెందిన వారున్నారు.
Read More :
Mukesh Ambani | మనుమల బర్త్ డే వేడుకల్లో ముకేశ్ అంబానీ దంపతులు