లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ సంసిద్ధమైంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు, నేరాల పెరుగుదలపై నిరసనగాఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం లక్నోలో సైకిల్ యాత్ర నిర్వహించారు. సోషలిస్ట్ నేత జనేశ్వర్ మిశ్రా జయంతోత్సవాల సందర్భంగా తాలూకా స్ధాయిలో సైకిల్ యాత్రలను ఎస్పీ శ్రేణులు నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సంసిద్ధం చేసేందుకే ఈ యాత్రలను చేపట్టినట్టు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.
కాగా సైకిల్ యాత్రకు ముందు అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400 స్ధానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక యూపీ పోరులో ప్రధాన పార్టీలతో పొత్తు ఉండదని చిన్న పార్టీలతో అవగాహనతో ముందుకెళతామని అఖిలేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్తో ఇటీవల భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపైనా ఊహాగానాలు సాగుతున్నాయి.