Akhilesh | యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయంలో సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో సారి కూడా యోగి ఆదిత్యనాథ్ విజయం సాధిస్తే, కచ్చితంగా ప్రధాన మంత్రి పదవికి పోటీదారుడవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరిగి మరో సారి యోగి విజయం సాధిస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించగా… కచ్చితంగా ప్రధాని అభ్యర్థి అవుతారని, ఈ విషయంలో బీజేపీ ఆలోచించుకోవాలన్నారు. ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారని, పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే మూట ముల్లె సర్దుకొని బీజేపీ రెడీగా ఉందని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు రాధే.. రాధే చెప్పడం మాత్రం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనే బీజేపీని ఓడించడానికి ప్రజలు రెడీ అయ్యారని, అధికారుల కారణంగా కొందరు అభ్యర్థులు బీ ఫామ్స్ కూడా నింపలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించి, మహాభారతాన్ని గుర్తు చేశారని అఖిలేశ్ బీజేపీపై మండిపడ్డారు. ఇలాంటి విషయాలను ప్రజాస్వామ్య వ్యవస్థలో తామెన్నడూ చూడలేదని, పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఝలక్నే బీజేపీకి ఇవ్వడానికి ప్రజలు రెడీ అయ్యారని అఖిలేశ్ పేర్కొన్నారు.