Akhilesh Yadav | రెండు మూడు రోజుల విరామం తర్వాత సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మళ్లీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజలందరికీ క్షమాపణలు చెబుతూ ఓ యాత్ర నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిర్వహించే జన విశ్వాస్ యాత్ర పేరును కాస్త జన మాఫీ యాత్రగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఘాటుగా విమర్శించారు. యూపీలోని గోండాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సీఎం ఆదిత్యనాథ్ పోటీ చేసే సీటుపై కూడా అఖిలేశ్ విమర్శలు చేశారు. ఏ సీటు నుంచి సీఎం యోగి పోటీ చేస్తారన్నది ఆయన్నే అడగాలంటూ ఫైర్ అయ్యారు. అప్పుడే ఓ సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తారని, మళ్లీ ఇంకో సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తారని మండిపడ్డారు. అసలు యోగి విషయంలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన యోగిని అధిష్ఠానం ముఖ్యమంత్రి చేసిందన్న ఆగ్రహం బీజేపీ కార్యకర్తల్లో ఉందని అఖిలేశ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అఖిలేశ్ను ప్రశ్నించగా.. అది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొనడం విశేషం.