ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసారి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి సీఎంలు, మాజీ సీఎంలకు ప్రజలు షాకిచ్చారు. వారిపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో అధికారం మాట దేవుడెరుగు.. సొంత నియోజక వర్గాల్లోనే ఓటములు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇలా ఒకళ్లు కాదు, ఇద్దరు కాదు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇద్దరు ప్రస్తుత ముఖ్యమంత్రులు, ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు మట్టికరిచారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ.. అధికారం చేపట్టి కొన్ని రోజులే అయింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ తాత్కాలిక సీఎంగా పగ్గాలు అందుకున్నాడు. ప్రజల్లో ఒకడినని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కరెంటు బిల్లులు మాఫీ చేస్తానని ప్రకటించి ప్రజల మనసులు గెలుచుకోవాలని అనుకున్నాడు. కానీ ప్రజలు మాత్రం నమ్మలేదు.
పంజాబ్ రాష్ట్రానికి ఐదుసార్లు సీఎంగా పని చేసిన కురువృద్ధుడు, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్కు కూడా ఈసారి ఓటమి తప్పలేదు. 1969 తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎదుర్కొన్న తొలి ఓటమి ఇదే అంటేనే.. రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ అధిష్ఠానంతో పొరపొచ్ఛాల కారణంగా సీఎం పదవికి రాజీనామా చేసి, తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదంటూ పార్టీని కూడా వీడిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. నవజోత్ సింగ్ సిద్ధూతో గొడవల కారణంగా కాంగ్రెస్ను వీడిన ఆయన వేరే పార్టీ పెట్టి, బీజేపీతో చేతులు కలిపారు. మరి ఇదే నచ్చలేదో లేదంటే మరేదైనా కారణముందో తెలీదు కానీ ప్రజలు మాత్రం అమరీందర్ వైపు చిన్నచూపు చూశారు. ఆయన్ను ఎన్నికల్లో ఓడించారు.
వీరితోపాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, దేశంలో 8వ మహిళా సీఎం అయిన రాజీందర్ కౌర్ భట్టల్ కూడా ఈసారి ఓడిపోయారు. పంజాబ్లో ఓడిపోయిన చాలా మంది నేతలు ఆప్ అభ్యర్థుల చేతిలోనే ఓటమి చవిచూశారు.
చన్నీలాగే అనుకోకుండా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మరో సీఎం.. ఉత్తరాఖండ్కు చెందిన పుష్కర్ సింగ్ ధామి. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. త్రివేంద్ర సింగ్ రావత్ తర్వాత తీరథ్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ను కూడా తప్పించిన తర్వాత ధామికి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కింది. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే ఆ సీటులో ధామి కంటిన్యూ అయ్యేవారేమో? కానీ అదృష్టం కలిసి రాలేదు. దాంతో ధామి.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇక మాజీ ముఖ్యమంత్రుల విషయానికొస్తే.. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ సింగ్ రావత్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందే పార్టీతో పొరపొచ్ఛాలు ఉన్నట్లు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈయన ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రకరకాల వ్యూహాలు పన్నినా కూడా ఏవీ ఫలించలేదు. 17 వేల ఓట్లపైగా తేడాతో ఓటమి చవి చూశారు.
గోవాలో కూడా తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం చర్చిల్ అలెమావో ఓటమి పాలయ్యారు. ఆప్ అభ్యర్థి బెనాలిమ్ చేతిలో ఆయన ఓడిపోయారు.