బెంగళూర్ : కర్నాటక ప్రభుత్వం పలు ప్రాజెక్టులపై 40 శాతం కమీషన్ వసూలు చేస్తోందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆరోపించిన నేపధ్యంలో తాజాగా లింగాయత్ మఠాధిపతి దింగలేశ్వర్ స్వామి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం 30 శాతం కమీషన్ను మినహాయించుకుని మఠాలకు గ్రాంట్స్ మంజూరు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, స్వామీజీలకు (మఠం) గ్రాంట్ ఇవ్వాలంటే ముందుగా 30 శాతం కమీషన్ కోత విధిస్తారని అన్నారు.
మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంతో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమిషన్ డిమాండ్ చేశారని పాటిల్ ఆరోపించడం కలకలం రేపింది.
కాంట్రాక్టర్ ఆరోపణల నేపధ్యంలో మంత్రి పదవి నుంచి ఈశ్వరప్ప వైదొలిగారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మరణానికి కారణమైన ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంట్రాక్టర్ మృతి, సూసైడ్ నోట్తో బీజేపీ సర్కార్ను విపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా లింగాయత్ మఠాధిపతి చేసిన ఆరోపణలు బొమ్మై సర్కార్ను మరింత ఇరకాటంలో పడేశాయి.