(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య భారతం గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో పౌరుల ప్రాథమిక హక్కులతో పాటు ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతకు భంగం వాటిల్లుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ‘ది లీఫ్లెట్’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
గణతంత్ర రాజ్యంగా అభివర్ణించే భారత్లో గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. సెక్యులర్ రిపబ్లిక్ అనే భావన ఎక్కడా కనిపించట్లేదు. పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతున్నది. న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం వంటి సంస్థల స్వతంత్రత ప్రశ్నార్థకమైంది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో పోలిస్తే, దేశంలో ప్రస్తుతం అంతకంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో న్యాయవ్యవస్థ గొంతుకను కొంతవరకూ నొక్కిపెట్టారు. అయినప్పటికీ, పది హైకోర్టులు ప్రజల హక్కులకు అనుకూలంగా తీర్పును వెలువరించాయి. అయితే, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
మైనారిటీ వర్గాలను ఓ భూతంగా చూపిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిని బలిపశువులను చేస్తున్నది. దీనికోసం మీడియాతో పాటు సోషల్మీడియాలో విష ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నది. జర్మన్ నాజీ నేత జోసెఫ్ గోబెల్స్.. ఒక అబద్దాన్ని వందసార్లు వల్లెవేస్తూ.. దాన్నే నిజం అన్నట్టు కనికట్టు చేసేవాడు. అచ్చం అలాగే, విద్వేష, తప్పుడు ప్రచారాలను ఒక క్రమపద్ధతిలో బీజేపీ ప్రభుత్వం తెరమీదకు తీసుకొస్తున్నది. అదే నిజమంటూ నమ్మిస్తున్నది. తమకు వ్యతిరేక కథనాలను (గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్రపై బీబీసీ తాజా డాక్యుమెంటరీని ఉదహరిస్తూ..) ప్రసారం చేసే మాధ్యమాలపై ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్షిప్ విధిస్తున్నది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి వాక్స్వేచ్ఛను కాలరాస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగాల్సిన ఎన్నికలను ధనబలంతో నిర్వీర్యం చేస్తున్నారు. యూపీలోని రామ్పూర్లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్కు ముస్లింలను అనుమతించకపోవడమే దీనికి ఉదాహరణ. ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్కు సవరణల ద్వారా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మూడింట రెండొంతుల విరాళాలను బీజేపీనే దక్కించుకొంటున్నది. ప్రధాని మోదీ, ఆయన పార్టీకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించని పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయానుసారమే ఎన్నికలను ఈసీ నిర్వహిస్తున్నదని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించలేదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.