హైదరాబాద్: సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1(ADITYA-L1) స్పేస్క్రాఫ్ట్ను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించనున్నది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 నిమిషాలకు ఆ ప్రయోగం ఉంటుందని ఇవాళ ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇండియా తొలిసారి ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపడుతోంది. సూర్యుడి-భూమి కక్ష్యలోని లగరేంజ్ పాయింట్(ఎల్-1) వద్ద ఆ స్పేస్క్రాఫ్ట్ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్-1 పాయింట్లో శాటిలైట్ను నిలపడం వల్ల.. సూర్యుడిని నిరంతరం చూసే అవకాశం ఉంటుందని ఇస్రో ఓ ప్రకటనలో చెప్పింది. ఆ పాయింట్ నుంచి గ్రహణ సమయంలోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇస్రో వెల్లడించింది. దీని వల్ల సూర్యుడి అధ్యయనం సులువు అవుతుందని, రియల్ టైంలో స్పేస్ వెదర్పై కలిగే ప్రభావాన్ని స్టడీ చేయవచ్చు.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx
— ISRO (@isro) August 28, 2023
ఆదిత్య ఎల్1 స్పేస్క్రాఫ్ట్లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉన్నాయి. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బహ్యభాగం, సూర్యుడి కేంద్రకం కరోనాతో పాటు ఇతర ప్రాంతాలను స్టడీ చేయనున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్, పార్టికల్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్లతో ఈ స్టడీ చేపడుతారు. ఎల్1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యున్ని వీక్షించనున్నాయి. ఇక మిగితా మూడు పేలోడ్స్ మాత్రం ఆ పాయింట్ వద్ద ఉన్న పదార్ధాలను స్టడీ చేయనున్నాయి. ఈ పేలోడ్స్ వల్ల సౌర వ్యవస్థకు చెందిన కీలకమైన శాస్త్రీయ సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు. చంద్రయాన్-3తో సూపర్సక్సెస్ కొట్టిన ఇస్రోకు.. ఆదిత్య ఎల్1 ప్రాజెక్టు మరింత బూస్టింగ్ ఇవ్వనున్నది.
పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య శాటిలైట్ను ప్రయోగించనున్నారు. ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశిస్తున్నవారు .. ఇస్రో లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ లింక్ ఓపెన్కానున్నది.