న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే పాట పాడుతున్నారని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ఆరోపించారు. దేశంలో ఇప్పుడు యూపీఏ లేదని కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
తమ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు మోదీ, దీదీ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. దీదీ, బీజేపీ మధ్య సంబంధాలు పాతవేనని, ఇప్పుడు తనతో పాటు, పార్టీని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకు కాషాయ పార్టీతో మమతా బెనర్జీ లోపాయికారీగా జట్టు కడుతున్నారని అధీర్ దుయ్యబట్టారు.
కాగా ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీని నిలువరించడం సులభమేనని, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ఇప్పుడు లేదని మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేతలతో భేటీ నేపధ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేసిందని, తాము గోవా ఎన్నికల బరిలో దిగితే తప్పేంటని దీదీ కాంగ్రెస్ను నిలదీశారు.