హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆక్సిజన్.. ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే మాట. ఢిల్లీలో పరిస్థితులను చూస్తుంటే మన దగ్గర కూడా అదే తరహా పరిస్థితులు వస్తాయేమోనన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతానికైతే ఢిల్లీలో కనిపిస్తున్నంత కొరత తెలంగాణలో లేదు. కానీ, వైద్యశాలల్లో ఆక్సిజన్ వాడకం పెరిగింది. సాధారణంగా మన రాష్ట్రంలోని దవాఖానల్లో రోజుకు సగటు వినియోగం 20-50 మెట్రిక్ టన్నులుండేది. కరోనాతో గతేడాది మే-జూన్ నెలల్లో ఆక్సిజన్ వాడకం 175 మెట్రిక్ టన్నులకు చేరుకొన్నది. అప్పటివరకు అదే ఆల్టైం రికార్డు. తొలి వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఒక దశలో 30 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ డిమాండ్ పడిపోయింది. 20 రోజులుగా కేసులు పెరుగుతుండటం, ఆక్సిజన్ అవసరమున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో దవాఖానలన్నీ ఆక్సిజన్ కోసం ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టాయి. ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఉన్నప్పటికీ ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2-3 రోజులుగా ప్రైవే టు దవాఖానలు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్నాయి.
మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నా యి. మిగిలిన ఆక్సిజన్ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే. వైజాగ్నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుంది.
ప్రభుత్వ దవాఖానల్లో పర్వాలేదు
తెలంగాణ సర్కారు ముందుచూపుతో వ్యవహరించడంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలకు ప్రస్తుతానికైతే కొదవలేదు. రాష్ట్రంలోని 22 వైద్యశాలల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ నిల్వల కోసం ట్యాంకులున్నాయి. వీటి లో 17 ట్యాంకులను ఇటీవలే నిర్మించారు. వీటిని అందుబాటులోకి తీసుకురావడంతో దవాఖానల్లో ఆక్సిజన్ కోసం రోగులు ఇబ్బందులు పడే పరిస్థితిలేదు. లిక్విడ్ ఆక్సిజన్ టవర్లను రాష్ట్రంలోని 17 దవాఖానల్లో ఏర్పాటుచేశారు. గచ్చిబౌలి టిమ్స్లో 26 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న టవర్ను ఏర్పాటుచేశారు. మరో 10 దవాఖానల్లో 13 కిలో లీటర్ల సామర్థ్యం, మూడింటిలో మూడు కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న టవర్లను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు.
ఇవీ కూడా చదవండి…
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి