నదికే కొత్త నడక నేర్పారు
గోదావరి జలాలు తెచ్చి మెదక్ జిల్లాకు జీవం పోశారు..
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
ర్యాలమడుగు చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యే
మెదక్ రూరల్, ఏప్రిల్ 22: నదికే కొత్త నడక నేర్పిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డితో కలిసి ర్యాలమడుగు చెక్డ్యాం వద్ద గోదావరి జలాలకు చీరె సారె సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెతుకు సీమ మెదక్ను సమై క్య రాష్ట్రంలో అప్పటి పాలకులు మెతుకు లేని సీమగా మార్చారన్నారు.జిల్లాను ఎడారిగా మార్చి సాగునీటి కష్టాలు తెచ్చారన్నారు. సీఎం కేసీఆర్ కాళేశరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను మళ్లించి ఘనపూర్ ఆనకట్టు, హల్దీకు జలకళ తెచ్చి పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైతుబంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ 24గంటల ఉచిత కరెంట్ ఇస్తూ.. కాళేశ్వరం నీరు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీపీ యమున జయరాంరెడ్డి, సొసైటీ చైర్మన్లు హన్మంత్రెడ్డి, సర్పంచ్ రజినీ, పార్టీ మం డల అధ్యక్షుడు అంజాగౌడ్, సర్పంచులు గంజి ప్రభాకర్, కళావతి, టీఆర్ఎస్ నాయకులు కిష్ట య్య, నవీన్, శ్రీధర్రెడ్డి, రజినీకాంత్, సత్తయ్య, యాదగిరి, భిక్షపతి, నరేందర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఏఈ శ్రీహరి పాల్గ్గొన్నారు.
సీఎం కేసీఆర్ కృషితోనే అద్భుతం ఆవిష్కారం
పాపన్నపేట, ఏప్రిల్ 22: జీవనది గోదావరి తన ఉపనది మంజీరలో కలిసే అపూర్వ దృశ్యం సీఎం కేసీఆర్ కృషితోనే ఆవిష్కృతమైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గోదావరి జలాలు పాపన్నపేట మండల పరిధిలోకి ప్రవేశించిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గాంధారిపల్లి శివారులోని మంజీర నదిలో చెక్డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఇంజినీర్లా వ్యవహరించి గోదావరి జలాలను మంజీర నదికి రివర్స్ తేవడం గొప్ప విషయం అన్నారు. గోదావరి జలాలు రాకతో గజ్వేల్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోని రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని తెలిపారు. సమైక్య రాష్ర్టంలో అప్పటి ప్రభుత్వాలు సింగూరు జలాలను హైదరాబాద్కు తరలిస్తే, సీఎం కేసీఆర్ సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు అందించారన్నారు. కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుబేరుడు, స్థానిక సర్పంచ్ శోభారాణి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తీసుకొ చ్చి ర్యాలమడుగు చెక్ డ్యాంలో నింప డం చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం. మాకు రెండు పంటలు వర్షాలతో సంబంధం లేకుండా పండుతాయి. మండుటెండల్లో చెక్డ్యాం మత్తడి దుంకుతుండడంతో మా ఆనందానికి అవధుల్లేవు. మా ప్రాంత రైతులకు శాశ్వతంగా సాగునీటి సమస్యను తీర్చిన కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
-రజనీకాంత్, రైతు, మగ్ధ్దుమ్పూర్, మెదక్ మండలం
ఎక్కడి గోదావరి.. ఎక్కడి ర్యాలమడుగు
మండుటెండల్లో చెక్డ్యాం నిండి మత్తడి దుంకడం చూడలేదు. ఎక్కడి గోదావరి.. ఎక్కడి ర్యాలమడుగు. రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలనే గంగమ్మ తల్లిని ఇక్కడికి తెచ్చిన సీఎం సార్ మాకు దేవుడు. పుట్టి ఇన్ని ఏండ్లయింది. కానీ,ఎండకాలంలో చెక్డ్యాం నిండి మత్తడి దుంకడం కేసీఆర్ సార్ దయతోనే చూస్తున్న.
-విద్యారావు, రైతు, మగ్ధుమ్పూర్,మెదక్ మండలం