న్యూఢిల్లీ, నవంబర్ 21: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా 19 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలిని ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. కౌశంబి జిల్లా డెర్హా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలోని ప్రధాన రహదారిపై పట్టపగలు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరైన పవన్ నిషద్ మూడేండ్ల క్రితం మృతురాలిపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు.
అతడి సోదరుడు అశోక్ నిషద్ మరో హత్య కేసులో నిందితుడు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే బెయిల్పై విడుదలయ్యారు. పవన్ అతడి అనుయాయులు మూడేండ్ల నుంచి లైంగిక దాడి కేసును ఉపసంహరించుకొమ్మని బాధితురాలిని వేధిస్తున్నారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో పశువులను మేపి ఇంటికి తిరిగి వస్తున్న ఆమెను నిందితులు వెంటాడి హత్య చేసి పరారయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది. ‘యూపీలో కిరాతకులకు చట్టాలంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక్కడ ఆడ బిడ్డలు ఎంతో అభద్రతతో బతుకుతున్నారు. వారు తాము పొగొట్టుకొన్న గౌరవం కోసం గళం పెంచితే వాళ్ల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.