కోల్కతా : తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. జార్ఖండ్లో ప్రజల మన్ననలు పొందలేని బీజేపీ అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్లోనూ అలాంటి ప్రయత్నాలు చేసిన బీజేపీని మమతా బెనర్జీ నిలువరించారని అన్నారు.
కోల్ స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ ఆయనను ప్రశ్నించగా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ దర్యాప్తు సంస్ధలను ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడీ ఎందుకు చురుకుగా లేదని ప్రశ్నించారు. ఈడీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు.
తాను మాట్లాడుతూనే ఉంటానని, దొంగను దొంగ అనకుండా ఇంకా ఏమని అంటారని నిలదీశారు. గోవుల స్మగ్లింగ్ సొమ్ము ఎక్కడకు వెళుతున్నదని ప్రశ్నించిన అభిషేక్ బెనర్జీ ఈ డబ్బు నేరుగా హోంమంత్రి అమిత్ షాకు చేరుతోందని చెప్పారు. తమ పార్టీ నేతలు ఎవరిపై దాడులు జరుగుతాయి, సమన్లు జారీ అవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారని అంటే వారు సీబీఐని ఎంతలా ప్రభావితం చేస్తున్నారో వెల్లడవుతోందని కాషాయ పార్టీపై అభిషేక్ బెనర్జీ విరుచుకుపడ్డారు.