న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దాడుల నేపధ్యంలో ఆప్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నెంబర్ వన్ టార్గెట్గా ఎంచుకన్నారని ఆప్ ప్రతనిధి సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు. 31 ప్రదేశాల్లో సీబీఐ చేపట్టిన విస్తృత దాడుల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో సీబీఐ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
900 మంది ఐటీ సీబ్బంది దాడుల్లో పాల్గొని ఏం నిగ్గుతేల్చారో తెలపాలని కోరారు. గతంలో సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని పాత వీడియోల్లో వాపోయిన మోదీ ఇప్పుడు విపక్షాలపై ప్రయోగిస్తూ ప్రతిపక్షాలను వీలైనంత ఇబ్బంది పెట్టాలని దర్యాప్తు ఏజెన్సీలను ప్రేరేపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్ర నేతల నుంచి సీబీఐపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. మరోవైపు మనీష్ సిసోడియా మద్యం పాలసీ కేసులో నెంబర్ వన్ నిందితుడే అయినా ఈ స్కాం వెనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. విలేకరుల సమావేశానికి హాజరైన మనీష్ సిసోడియాకు ముఖం చెల్లలేదని, ఆయన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదని అన్నారు.
మనీష్ సిసోడియాకు కేవలం మనీ వ్యామోహంతో డబ్బు తీసుకుని మౌనంగా ఉంటున్నాడని ఎద్దేవా చేశారు. మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మోదీ మధ్యే పోటీ ఉంటుందని సిసోడియా చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తప్పుపట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ విపక్షాల అభ్యర్ధిగా ముందుకొస్తే తమ పని మరింత సులువవుతుందని అన్నారు.