AAP Bets Samajwadi | పంజాబ్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్).. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంటే పెద్దదిగా నిలువనున్నది. రాజ్యసభలో పార్టీ బలాబలాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీలకు చెరో ఐదు మంది ఎంపీలున్నారు. ఎగువసభలో ఆప్ ఐదో అతిపెద్ద పార్టీ కానున్నది. నూతన సమీకరణాల ప్రకారం అకాలీదళ్కు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండదు. బీఎస్పీ ఒక స్థానానికి పరిమితం అవుతుంది.
పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎంపీల పదవీ కాలం వచ్చేనెల 9, మరో ఇద్దరి పదవీ కాలం జూలై 4తో ముగుస్తుంది. ఈ నెల 31న ఐదు స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ ఖాతాలోకి నాలుగు వెళతాయి. ఒక స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. జూలై 4న జరిగే ఎన్నికల్లో రెండు సీట్లు ఆప్ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం ముగ్గురికి పరిమితమైన ఆప్ సభ్యుల సంఖ్య ఎగువసభలో తొమ్మిది మందికి చేరనున్నది. అంటే రాజ్యసభలో ఆప్ సభ్యుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందన్న మాట. దీని ప్రకారం రాజ్యసభలో ఐదో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నది.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ 97 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవగా, కాంగ్రెస్ 34 మందితో రెండో స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మూడో స్థానం, డీఎంకే నాల్గవ, బిజూ జనతాదళ్ (బీజేడీ) ఐదో పార్టీగా ఉంది. బీజేడీకి తొమ్మిది మంది సభ్యులున్నారు. అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీకి ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆరుగురు సభ్యుల బలం ఉంటే జూన్ నాటికి ఎనిమిది మందికి చేరనున్నారు. నలుగురు ఎంపీల పదవీ కాలం జూన్లో పూర్తవుతుండగా, అందులో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకోనున్నది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రాజ్యసభలో తన బలం పెంచుకోనున్నది. ప్రస్తుతం 97 స్థానాలు ఉన్న బీజేపీ బలం 95కు తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. రాజస్థాన్ నుంచి మూడు, ఛత్తీస్గఢ్ నుంచి రెండు స్థానాలు ఉన్నాయి.
కేవలం పదేండ్లలోపు ఆప్ అద్భుత విజయాలు సాధించింది. దేశవ్యాప్తంగా ఎదుగుతున్న పార్టీగా నిలిచింది. దశాబ్దం లోపు ఆప్ మరో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నది. 2012 నవంబర్లో ఏర్పాటైన ఆప్ 2013 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసినా కొన్ని నెలల తర్వాత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఆప్ సక్సెస్ కాలేదు. 2015 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67 చోట్ల ఆప్ కైవశం చేసుకుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లోనూ చారిత్రక విజయాలు సాధించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింట ఆప్ పోటీ చేసింది. వాటిల్లో పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఆప్.. ఉత్తరాఖండ్లో 3.5 శాతానికి పైగా ఓట్లు పొందింది. యూపీలో మాత్రం నిరాశ మిగిలింది.