ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Polls) పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ‘పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయదు’ అని ట్వీట్ చేశారు.
కాగా, మహారాష్ట్రలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ తమ పార్టీని సంప్రదించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తరపున కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని చెప్పారు.
మరోవైపు మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది. జార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.