అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేజ్రీ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. ఇటీవల సూరత్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమక్షంలో సీనియర్ జర్నలిస్టు ఇసుధన్ గాధ్వీ పార్టీలో చేరారు. గుజరాత్ రూపం మారిపోతుందని, తాను ఆ రాష్ట్రానికి రాబోతున్నారని, అక్కడ ప్రజల్ని కలుస్తానని కేజ్రీ ఆదివారమే ఓ ట్వీట్ చేశారు. ఆశ్రమ్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కేజ్రీవాల్ ప్రారంభిస్తారు.