న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం నియంతృత్వంలోకి వెళుతుందని ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ దేశ రాజ్యాంగాన్ని మార్చి తాను బతికున్నంత వరకూ దేశానికి ఆయననే రాజుగా ప్రకటించుకునే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్ధలను ఉసిగొల్పి విపక్ష నేతలను జైళ్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీపైనా ఆప్ నేత విమర్శలు గుప్పించారు. ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదని ఆరోపించారు.
నాయకుల కొరత కాంగ్రెస్ను వేధిస్తుండగా, ఆ పార్టీకి ఐడియాలు కూడా కరువయ్యాయని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆప్ ఐడియాలు, సంక్షేమ పధకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రణాళికలకు అరవింద్ కేజ్రీవాల్ గ్యారంటీలు అని పేరు పెట్టగా కాంగ్రెస్ ఈ పదాన్ని కూడా కాపీ కొట్టిందని అన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్పై ఆప్ నిరసనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించని నేపధ్యంలో ఆప్ నేత భరద్వాజ్ కాంగ్రెస్పై విమర్శలకు దిగడం గమనార్హం.
Read More