న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశానికి 53 మంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు కీలక భేటీకి హాజరు కావడంతో ఆపరేషన్ కమలం విఫలమైందని ఆప్ ప్రతినిధి సౌరవ్ భరధ్వాజ్ వ్యాఖ్యానించారు. భేటీకి హాజరు కాని ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ ఫోన్లో మాట్లాడారాని వారంతా తుదిశ్వాస విడిచేవరకూ మీ వెంటే ఉంటామని చెప్పారని తెలిపారు. సమావేశానంతరం భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అన్నారు.
సిసోడియా నివాసంపై జరిగిన దాడుల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ 20 కోట్లు ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన భేటీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, వారంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు.
బీజేపీ తమ పార్టీని చీల్చలేదని ధీమా వ్యక్తం చేశారు. సమావేశానంతరం సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యేలు రాజ్ఘాట్కు చేరుకుని ఆపరేషన్ లోటస్ నుంచి తమ పార్టీని కాపాడుకునేందుకు ప్రార్ధనలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తూ కేజ్రీవాల్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణల నేపధ్యంలో కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.