న్యూఢిల్లీ : ఆప్ సారధ్యంలోని ఢిల్లీ సర్కార్ను కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సీబీఐ, ఈడీలను ఆప్ నేతలపై ప్రయోగిస్తూ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలను అడ్డుకోవాలని పీఏసీ భేటీ తీర్మానించింది. లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో ఎలాంటి పత్రాలు, లెక్క తేలని సొమ్ము, ఆభరణాలు లభించకపోయినా దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించి ఆప్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశం తీర్మానం చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క ఆప్ ఎమ్మెల్యే పార్టీని వీడరని స్పష్టం చేశారు. విపక్ష ప్రభుత్వాలను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలతో కూలదోల్చడంపై దృష్టి సారించే బదులు ప్రజల అభివృద్ధికి ఆ సమయాన్ని వెచ్చించాలని ప్రధాని మోదీని తాము కోరుతున్నామని ఆప్ ఎంపీ సింగ్ పేర్కొన్నారు.