AAP : మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ తాజా సమన్ల నేపధ్యంలో ఈ వ్యవహారంపై ఆప్ స్పందించింది. విపక్ష ఇండియా కూటమి నుంచి బయటపడకుంటే ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని మోదీ ప్రభుత్వం తమకు సంకేతాలు పంపుతోందని ఆప్ నేత దిలీప్ పాండే ఆరోపించారు.
మార్చి 4న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ ఎందుకు ఇంతగా కేజ్రీవాల్ను వెంటాడుతున్నదనేది ప్రతి ఒక్కరికీ తెలుసని పాండే పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉందని, కోర్టు నిర్ణయం వచ్చేవరకూ ఈడీ ఎందుకు వేచిచూడలేకపోతోందని ఆయన ప్రశ్నించారు.
ఇండియా అలయన్స్ నుంచి తాము బయటకు రావాలని బీజేపీ కోరుకుంటోందని, లేకుంటే కేజ్రీవాల్ జైల్లో ఉంటారని తమకు చెప్పేందుకు ప్రయత్నిస్తోందని పాండే కాషాయ పార్టీని దుయ్యబట్టారు. తాము ఇండియా అలయన్స్ను వీడమని, తమపై ఎంత ఒత్తిడి ఉన్నా తాము విపక్ష కూటమి నుంచి బయటకు రామని ఆప్ నేత స్పష్టం చేశారు.
Read More :
KTR | ప్రతీసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు : కేటీఆర్