KTR | ప్రతీసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిర అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. నీటి లభ్యత ఉన్న సమయంలో ఎల్లంపల్లి, మిడ్మానేరు నుంచి సైతం నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రతిపాదించిన తర్వాత.. ఆ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం మారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బరాజ్లు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు.. 88 నుంచి 681 మీటర్లకు నీటిని లిఫ్ట్ చేయాలంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టాలంటే బాహుబలి మోటర్లు కూడా పెట్టి.. 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను పెట్టి.. జలధార, జీవధార తెలంగాణకు కరువు అనేది తిరిగి చూడకుండా వరప్రధాయినిలా కాళేశ్వరాన్ని ప్రాజెక్టును నిర్మించారు. కొత్త ఆయకట్టు, స్థిరీకరించే ఆయకట్టు రెండు కలిపితే 40లక్షలకుపై చీలుకు ఎకరాలకు బృహత్తరమైన, తెలంగాణను సస్యశ్యామలం చేసే బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం’ అన్నారు.
‘ఎప్పుడూ చెబుతుంటారు పెద్దలు. ప్లాన్ ఏ ఉండాలి.. బీ కూడా ఉండాలి. ఒకటి విఫలమైనా.. ప్రత్యామ్నాయం ఒకటి ఉండాలని. అదే పద్ధతిలో ఆలోచనతో, ఇంజినీర్లు అందరూ కలిసి అహోరాత్రులు శ్రమించి ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టిస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని తెలుసు. ప్రతీసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్టు నుంచి ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. ఒకవేళ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద వస్తే.. మిడ్మానేరు ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చు. ఈ రెండు జరగని పక్షంలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకునే సౌలభ్యం ప్రాజెక్టులో ఇమిడి ఉంది. అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు. మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో కాళేశ్వరాన్ని నిర్మించుకోవడం జరిగింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, అప్పర్ మానేరు మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టు కూడా స్థిరీకరించేలా ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది’ అన్నారు.
‘శివాలయంలా శిథిలమైపోయిన శ్రీరాంసాగర్ జలకళతో జీవం పోసుకున్నదంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే. మా కండ్ల ముందే వరద కాలువలో పిల్లలు క్రికెట్ ఆడుకున్న పరిస్థితి ఉండే. కాకతీయ కాలువలో తుమ్మలు మొలిచిన పరిస్థితి. చొప్పదండి, కోరుట్ల, బోయినపల్లిలో వరద కాలువ గతంలో ఎలా ఉండేదో తెలుస్తుంది. కానీ, అదే వరద కాలువను రిజర్వాయర్లా మార్చి దాన్ని కూడా.. నీటి స్టోరేజీకి వాడుకొని.. చెరువులను నింపి.. లక్షల ఎకరాలకు నీరందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాకతీయ కాలువ ఆరు నెలల పాటు ఆగకుండా ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది. ఉత్తమ్ కుమార్రెడ్డికి కూడా తెలుసు’నన్నారు.
‘ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆయన భార్య ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్నగర్, కోదాడతో పాటు తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్, మహబూబాబాద్ వరకు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం నీళ్లేనని ఉత్తమ్కుమార్రెడ్డికి మనసునిండా తెలుసు. ఎస్సారెస్పీ కట్టిన నాటి నుంచి నేటి వరకు టెయిలెండ్కు ఎప్పుడూ నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే కాళేశ్వరం చలువతోనే ఈ ప్రాంతాలకు నీరందిందనేది ఆయనకు తెలుసు. కానీ, బయటకు చెప్పలేకపోతున్నారు. చెప్పేందుకు బేషజం అడ్డం వచ్చి ఉండవచ్చు. ఎండకాలంలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువ మానేరు అలుగుపోసిందంటే కాళేశ్వరం మహత్యం కాదా? కాళేశ్వరం మల్టిపర్పస్ ప్రాజెక్టు అని ఎందుకు చెబుతున్నామంటే.. కేవలం నీటిని నిల్వ చేయడమే కాదు. ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం. కాళేశ్వరం ద్వారా వాగుల్లోనూ నీళ్లుపోశాం. హల్దివాగు, కూడవెళ్లి వాగులో కాళేశ్వరం నీళ్లుపోసింది నిజం కాదా? వందల మండుటెండల్లో చెరువులు అలుగులుపోసింది వాస్తవం కాదా? 30-40 సంవత్సరాల తర్వాత నిండిన చెరువు అని ఎన్నివార్తలు పత్రికలు చూశాం.. ఇవన్ని నిజం కాదా?’ అంటూ ప్రశ్నించారు కేటీఆర్.