న్యూఢిల్లీ : ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై దాడులను ఈడీ ఉపసంహరించుకుందని ఆప్ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఈడీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా సిసోడియా నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఆపై మనీష్ సిసోడియా నివాసంపై దాడుల ఆలోచనను ఈడీ విరమించుకుందని అన్నారు.
గతంలో సీబీఐ దాడుల తరహాలోనే తాము కూడా సిసోడియా ఇంటిపై దాడుల అనంతరం ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వస్తుందని ఈడీకి అర్ధమైందని చెప్పారు. సిసోడియా నివాసంపై దాడుల విషయంలో దేశం ముందు నవ్వులపాలవుతామని ఈడీ గుర్తెరిగిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో రూ 2,500 కోట్ల భారీ పోషకాహార కుంభకోణం బయటపడితే అక్కడ ఈడీ-సీబీఐ కేసులు ఏమైనా నమోదు చేశాయా అని ఆప్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
మధ్య నిషేధం అమలవుతున్న గుజరాత్లో పట్టపగలే మద్యం ప్రవహిస్తుంటే సీబీఐ ఎలాంటి దాడులైనా చేపట్టిందా అని సౌరవ్ భరద్వాజ్ నిలదీశారు. ప్రధాని మోదీ అవినీతిపై పోరాడటం లేదని, సీఎం అరవింద్ కేజ్రీవాల్పై పోరాడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ మోడల్ను భగ్నం చేసేందుకు మోదీ అన్ని చర్యలూ చేపడుతున్నారని అన్నారు. కేంద్రం వత్తిడి చేయడంతోనే సీబీఐ వద్ద పనిచేసే డిప్యూటీ లీలగల్ అడ్వైజర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.