న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రిలిజియస్ కమిటీకి లేఖ రాసిందని సింగ్ పేర్కొన్నారు.
ఢిల్లీలో ఆలయాలను కూల్చేందుకు బీజేపీ ఎలా ప్లాన్ చేసిందో తాను వెల్లడిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కాషాయ నేతలు మతం పేరుతో డ్రామా చేస్తున్నారని, విద్వేషం వెదజల్లుతున్నారని అన్నారు. అదే మోదీ సర్కార్ ఇప్పుడు ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఆలయాలను తొలగిచేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రిలిజియస్ కమిటీకి లేఖ రాసిందని చెప్పారు.
ఈ జాబితాలో పురాతన రామాలయం, కృష్ణుడి ఆలయం, దుర్గా ఆలయం, మహదేవ్ ఆలయం, సాయిబాబా ఆలయం, గురుద్వార ఉన్నాయని తెలిపారు. దేశ రాజధానిలోని కస్తూర్బా నగర్, శ్రీనివాస్పురి, మహ్మద్పుర్, సరోజినినగర్ ప్రాంతాల్లోని 53 ఆలయాలను కూలగొట్టేందుకు కేంద్రం సంసిద్ధమైందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఈ దిశగా లేఖ అందిందని, దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.