న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ కౌన్సిలర్లను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియాతో శనివారం మాట్లాడారు. ఢిల్లీలో తమ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచి, గతంతో పోల్చితే 80 సీట్లలో ఓడిన బీజేపీ మరోసారి డర్టీ గేమ్స్కు తెరతీస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన మాదిరిగా తమ కౌన్సిలర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నది ఆరోపించారు. తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మేయర్ పీఠం మాదే అని సిగ్గులేని బీజేపీ అంటున్నదని మండిపడ్డారు. వంద కోట్లతో పది మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. అయితే నిజాయితీతో అరవింద్ కేజ్రీవాల్ వెంట నిలిచే తమ కౌన్సిలర్లు బీజేపీ కుయుక్తులను ఎప్పటికప్పుడు బయటపెడతారని ఆయన అన్నారు.
మరోవైపు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆప్ కౌన్సిలర్లు కూడా బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. తమను బెదిరించడంతోపాటు ప్రలోభాలకు బీజేపీ గురిచేస్తున్నదని విమర్శించారు. మేయర్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ వేస్తే రూ.50 లక్షలు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేసినట్లు ఆప్ కౌన్సిలర్లు ఆరోపించారు.