Crime news: భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట్టింటికి వెళ్లిపోతా అనే పరిస్థితి తీసుకొచ్చింది. కర్ణాటకలోని మైసూరు పట్టణంలో ఈ ఘటన చోటచేసుకుంది. బాధితురాలి కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆమెను చెర నుంచి విడిపించడంతో విషయం బయటికి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మైసూరుకు చెందిన సన్నయ్య, సుమ ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సన్నయ్య కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతడికి భార్యపై అనుమానం. దాంతో రోజూ తను పనికి వెళ్లేటప్పుడు భార్యను ఓ గదిలో వేసి బంధిస్తున్నాడు. పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాళం తీస్తున్నాడు. గత 12 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నది.
తాళం వేసి వెళ్లేటప్పుడు మలమూత్రాదుల కోసం ఆమెకు ఒక డబ్బా ఇచ్చేవాడు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా తల్లికి వారిని కలిసే అవకాశం ఉండేది కాదు. మళ్లీ భర్త పని నుంచి వచ్చిన తర్వాతనే తాళం తీసేవాడు. అప్పటి నుంచి మరుసటి రోజు పిల్లలు స్కూల్కు, భర్త పనికి వెళ్లేదాక బయట ఉండేది. ఆ తర్వాత ఎప్పటిలాగే ఆమెను గదిలో పెట్టి తాళం వేసి వెళ్లేవాడు.
ఈ మధ్య కాలంలో భర్త ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. గత మూడు వారాల నుంచి ఆమెను పూర్తిగా గదికే పరిమితం చేశాడు. 24 గంటలూ గదిలోనే బంధించి ఉంచుతున్నాడు. విషయం తెలుసుకున్న పుట్టింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితురాలిని విడిపించి పుట్టింటికి పంపారు.
అయితే, భర్తపై ఫిర్యాదు చేసేందుకు సుమ నిరాకరించింది. తాను ఆయనపై ఫిర్యాదు చేయదల్చుకోలేదని చెప్పింది. తిరిగి ఆయన దగ్గరికి వెళ్లనని, పుట్టింట్లోనే ఉంటానని తెలిపింది.