బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న మహిళను ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆమె రన్నింగ్ బైక్ పైనుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
#WATCH| Bengaluru, Karnataka: Woman jumps off a moving motorbike after the rapido driver allegedly tried to grope her & snatched her phone
On 21st April, woman booked a bike to Indiranagar, driver allegedly took her phone on pretext of checking OTP & started driving towards… pic.twitter.com/bPvdoILMQ2
— ANI (@ANI) April 26, 2023
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 21న రాత్రి 11.10 గంటల సమయంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తాను పనిచేసే ప్రాంతం నుంచి ఇందిరానగర్లోని తన ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బైక్ చేసింది. మహిళను బైక్ ఎక్కించుకున్న రైడర్ ఓటీపీ చెక్ చేస్తానన్న పేరుతో ఆమె ఫోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత బైక్ను ఆమె చెప్పిన ఇందిరానగర్ వైపు కాకుండా దొడ్డబల్లాపూర్ వైపు మళ్లించాడు.
ఎందుకు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నావని బాధితురాలు పదేపదే ప్రశ్నించినా ర్యాపిడో రైడర్ పట్టించుకోలేదు. పైగా ఆమెను ఎక్కడపడితే అక్కడ తడమడం, అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో కీడు శంకించిన మహిళ అతని చేతిలో ఉన్న తన ఫోన్ను లాక్కుని, రన్నింగ్ బైక్ పైనుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఆమె సాయం కోసం తన స్నేహితుడికి ఫోన్ చేసింది.
అనంతరం అతనితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైడర్ను వెతికి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ముందుగా తాను పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించలేదని, గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్ సమస్య అంటూ తేలిగ్గా తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ర్యాపిడో వాళ్లకు కూడా ఘటనపై ఫిర్యాదు చేశానని, వాళ్లు ఇంతవరకు తనకు ఫోన్ కూడా చేయలేదని చెప్పింది.