బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ ‘మధ్యాహ్నం 12.30 గంటలకు పేలుడు జరిగింది. ఎన్ఐఏ, బాంబ్ స్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ పరికరాల్ని ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారు’ అని అన్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో దర్యాప్తు సంస్థలు రెండు కోణాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో ఒకటి ఉగ్రవాద కోణం కాగా, మరొకటి వ్యాపార శత్రు త్వం. ఈ కేఫ్కు సంబంధించిన శాఖలన్నీ బాగా వ్యాపారం చేస్తుండటంతో, వాటి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చునని ఓ వా రం నుంచి సంకేతాలు వస్తున్నట్లు చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): బెంగళూరులో బాంబు పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్స్టాండ్లు, రైల్వే స్లేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాల తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్స్కాడ్, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.