చెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేండ్ల బాలికను హోటల్ గదిలో నిర్బంధించి ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన పూనమల్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. ఐదేండ్ల కిందట బాలికను తల్లితండ్రులు విడిచిపెట్టడంతో బంధువుల ఇంట పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. గురువారం షాపునకు వెళ్లిన బాలిక అప్పటి నుంచి తిరిగి రాలేదు. బాలిక కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పెంపుడు తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఆమె ఆచూకీ పసిగట్టడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బాలిక ఆదివారం తిరిగి ఇంటికి చేరుకోవడంతో దుండగుల పైశాచికం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..షాపుకు వెళ్లేందుకు బయటకు వచ్చిన బాలికకు పరిచయమున్న వ్యక్తే బలవంతంగా బైక్పై ఎక్కించుకుని హోటల్కు తీసుకువెళ్లాడు. హోటల్ గదిలో బాలికను నిర్బంధించి మరో ఇద్దరితో కలిసి రెండ్రోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారి చెర నుంచి బాధితురాలు బయటపడి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.