భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. క్రిమినల్ కేసులున్న 90 మందిలో 51 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు భారతీయ ఆదివాసీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా పేర్కొంది. అలాగే గెలిచిన ఎమ్మెల్యేలలో 34 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని, ఇది 15 శాతమని వెల్లడించింది.
కాగా, మధ్యప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన 205 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 89 శాతం మంది కోటీశ్వరులు. ఈ కోటీశ్వరుల ఎమ్మెల్యేల్లో 144 మంది బీజేపీకి, 61 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. రత్లాం సిటీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే చెతన్య కశ్యప్ ఆ రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే. ఆయన మొత్తం సంపద రూ.296 కోట్లకు పైగా ఉందని ఏడీఆర్ తెలిపింది. అలాగే విజయరాఘవగర్ అసెంబ్లీ స్థానంలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సత్యేంద్ర పాఠక్ రూ.242 కోట్లకు పైగా సంపదతో రెండవ ధనిక ఎమ్మెల్యేగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల్ నాథ్ రూ. 134 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారని నివేదికలో పేర్కొంది.