లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. మరొకరిని ప్రాణాలతో కాపాడారు. మరో వ్యక్తి గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని నగర జాయింట్ కమిషనర్ పీయుష్ మోర్డియా తెలిపారు.
దిల్కుషా ప్రాంతంలోని మిలటరీ ప్రహరీ గోడ వెంబడి కొందరు గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. గురువారం రోజంతా కురిసిన వానకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గోడ కూలిపోయింది. దీంతో గుడిసెల్లో నిద్రిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు అని పీయుష్ చెప్పారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు.
కాగా, లక్నోలో నెల రోజుల్లో కురవాల్సిన వర్షపాతం గురువారం ఒక్కరోజే కురిసింది. సాధారణంగా లక్నోలో సెప్టెంబర్ నెలలో 197 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదవుతుందని, కానీ నిన్న 155 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వెల్లడించారు. కుండపోతగా కురిసిన వానతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయన్నారు.
UP | Nine people dead and 2 injured after a wall collapsed due to heavy rain in Lucknow. The incident took place in Dilkusha under Cantt: Home Department pic.twitter.com/Kxmml42KBe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2022