PM Modi | న్యూఢిల్లీ, అక్టోబర్ 17: తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజేపీ సర్కారు ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదంగా మారింది. 9 నగరాల్లో ఈ సెల్ఫీ పాయింట్స్ను ఏర్పాటుచేయనున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. డీఆర్డీవో, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సైతం ఇందులో భాగస్వామ్యం కానున్నట్టు ఈ అంశంతో సంబంధమున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాని మోదీ ఫొటోతో పాటు, ఉజ్వల్ యోజన, ఆత్మనిర్భర్ భారత్.. మొదలైన కేంద్ర పథకాల్ని ప్రజలకు తెలియజేసేలా ఈ సెల్ఫీ పాయింట్స్ను కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. ఇందులో రక్షణ శాఖ 822 సెల్ఫీ పాయింట్స్ను తీసుకురానున్నది. వీటిలో సైన్యం- 100, ఎయిర్ఫోర్స్-75, నేవీ-75, డీఆర్డీవో-50, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్-50, సైనిక్స్కూల్-50, మిగతా రక్షణ విభాగాలు 422 సెల్ఫీ పాయింట్స్ను ఏర్పాటుచేస్తాయని కేంద్రం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దేశానికి రక్షణ కల్పించే సైనికుల ధైర్యసాహసాలను, పేరు ప్రఖ్యాతలను ప్రధాని మోదీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. గత 75 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని విమర్శించారు.