స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన పంచాయతీరెండేండ్లలో గ్రామానికి రూ.మూడున్నర కోట్ల నిధులు
నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ
ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు
హరితహారం మొక్కలను కాపాడుతున్న సర్పంచ్, గ్రామస్తులు
మంచాల మార్చి 29:అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆరుట్ల గ్రామం స్వచ్ఛత, అభివృద్ధికి మారుపేరుగా మారింది. నిత్యం ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఏ వీధి చూసినా చక్కని సీసీ రోడ్డుతోపాటు అండర్గ్రౌండ్ డ్రేనేజీలను నిర్మించారు. మిషన్ భగీరథతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. పూలు, పండ్లు, తదితర మొక్కలతో పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా ఉన్నది. హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి గ్రామానికి పచ్చని తోరణాలుగా కనిపిస్తున్నాయి. రెండేండ్లలో రూ.మూడున్నర కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లె రూపురేఖలు మారాయి.
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆరుట్ల. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారాయి. స్వచ్ఛతకు మారు పేరుగా గ్రామం నిలిచింది. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. కాని టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆరుట్ల గ్రామం అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు కేరాఫ్గా నిలుస్తున్నది.
పరిశుభ్రతలో ఆదర్శంగా..
ఆరుట్ల గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాలనే తపనతో సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి, పంచాయతీ పాలక వర్గం సమష్టిగా పనిచేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.50 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, డ్వాక్రా భవనాలు, యువజన సంఘాల భవనాలు, వైకుంఠ ధామం, హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీ, వర్మీ కంపోస్టు యార్డు, పల్లెప్రకృతి వనం, కమ్యూనిటీ భవనాలకు నిధులు కేటాయించారు. ప్రతి రోజు పంచాయతీ సిబ్బందితో గ్రామంలోని వార్డులు శుభ్రం చేయించడం, పిచ్చి మొక్కలు తొలగించడం, హరితహారం మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం లాంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధిని చూసినా అందమైన సీసీరోడ్లు, రాత్రుల్లో జిగేలున మెరిసే వీధి దీపాలు కనిపిస్తాయి.
వైకుంఠధామానికి రూ.12.60 లక్షలు
ఆరుట్ల గ్రామంలో గతంలో వైకుంఠధామం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పల్లె ప్రగతిలో భాగంగా రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఇందులో స్నానాల గదులు, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు.
వర్మీ కంపోస్డు యార్డుకు రూ.2 లక్షలు
గ్రామంలో సేకరించిన చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేయడం కోసం రూ.2.30 లక్షలతో కంపోస్టు యార్డు నిర్మించారు. ప్రతి రోజు గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి వర్మీ కంపోస్టు ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ ఎరువును హరితహారం మొక్కలకు ఉపయోగిస్తున్నారు.
ట్రాక్టర్ రూ.5.45 లక్షలు
గ్రామంలో చెత్త సేకరణతో పాటు హరితహారం మొక్కలకు నీరు పోయడానికి రూ.5.40 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఈ ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజు ఉదయం గ్రామంలోని చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు యార్డుకు తరలిస్తారు. అనంతరం ట్యాంకర్ ద్వారా గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని అందజేస్తున్నారు.
పల్లెప్రకృతి వనానికి రూ.2.80 లక్షలు
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.2.80 లక్షలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల మొక్కలు నాటి క్రమం తప్పకుండా వాటికి నీటిని అందిస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో 40 రకాల మొక్కలు పెంచడంతో పాటు వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదకరంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
సెప్టెంబర్ నాటికి రెండో కొవిడ్ వ్యాక్సిన్ : అదర్ పూనవాలా