రాంచీ: ఒక గ్రామంలో జరిగిన ఉత్సవంలో ‘చాట్ మసాలా’ (chaat masala) తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలోని భోక్తాలో జాతర జరిగింది. ఈ సందర్భంగా హుచుక్తాన్ధాడ్ గ్రామానికి చెందిన సుమారు 80 మంది కల్తీ ‘చాట్ మసాలా’ తిని అనారోగ్యం పాలయ్యారు. జాతర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలుషిత ఆహారం వల్ల వారంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో రాత్రి 10.30 గంటలకు వారిని షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండిపోయాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అదనంగా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని రప్పించారు. ధన్బాద్ సివిల్ సర్జన్ డాక్టర్ అలోక్ విశ్వకర్మ ఆసుపత్రిని సందర్శించి అనారోగ్యం పాలైన వారి గురించి ఆరా తీశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.
Also Read: