హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని టర్నోవర్, లాభాలను సింగరేణి సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో 419 కోట్ల లాభాలు మాత్రమే రాగా, 2022-23లో రూ.2,222 కోట్లు ఆర్జించామని తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ సారథ్యంలో గడిచిన 9 ఏండ్లలో సాధ్యమయ్యిందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకముందు సంవత్సరం లాభాల బోనస్గా కార్మికులకు 83 కోట్లను చెల్లించగా.. ఈ యేడాది 700 కోట్లను చెల్లించనున్నట్టు తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ శాసనసభలో సింగరేణి ప్రగతిని ప్రశంసిస్తూ.. కార్మికులకు లాభాల బోనస్, దీపావళి బోనస్ కలిపి 1000 కోట్లను చెల్లించనున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. ఆ మేరకు దసరాకు ముందే 700 కోట్ల బోనస్ను పంపిణీ చేస్తామని తెలిపారు. 2029-30 నాటికి సింగరేణి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటుతుందని, అలాగే 50 వేల కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి కృషి చేసిన జీఎం సురేశ్, లైజన్ అండ్ ప్రొటోకాల్ ఆఫీసర్ హరినాథ్, ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ కరుణశ్రీ, ఆఫీస్ అటెండెంట్ సాయిబాబాను సన్మానించారు.