Adenovirus | గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో అడోనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. వైరస్ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ఆసుపత్రిపాలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా, గత 24 గంటల్లో అడోనోవైరస్ (Adenovirus) కారణంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ (Adenovirus) మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. ‘గత 24 గంటల్లో వైరస్ కారణంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కోల్కతాలోని (Kolkata) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో (Bankura Sammilani Medical College and Hospital) ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించారు. వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించాం. వైరస్ లక్షణాలతో ఉన్న వారి నమూనాలను పరీక్షల కోసం పంపాం. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది’ అని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్ఐ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (ARI) సర్వసాధారణమని.. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు. పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ఇదిలాఉండగా.. రాష్ట్రంలో అడెనో వైరస్ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో చర్చించి.. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వైద్య సిబ్బంది, ఇతర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.
అడెనోవైరస్ (Adenovirus) సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుందని చెప్పారు. బలహీనమైన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు అడెనోవైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందన్నారు. రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల, మలమూత్రాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.
ఈ వైరస్ 0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సంక్రమణకు ఎక్కువగా గురవుతారని.. ఈ కేసులను ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. పిల్లల్లో, అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని పేర్కొంటున్నారు.
అడెనోవైరస్ (Adenovirus) సోకిన వారికి నిర్దిష్ట చికిత్సా విధానం లేదని వైద్య నిఫుణులు తెలిపారు. అలాగే ఆమోదించిన యాంటీవైరల్ మందులు కూడా లేవని చెప్పారు. నొప్పి నివారణ మాత్రల ద్వారా తేలికపాటి లక్షణాలు తగ్గుతాయని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వెల్లడించారు. ఎల్లప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
Also Read..
Virat Kohli | ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కష్టాల్లో టీం ఇండియా.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Assembly elections results | మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్..
Afghanistan earthquake | అఫ్గానిస్థాన్లో 4.1 తీవ్రతతో భూకంపం