Iron Bridge Stolen in Bihar | దొంగలు దోపిడీకి పాల్పడ్డారంటే.. ఏ బంగారమో.. లేదా భారీ మొత్తంలో నగదు దోచుకెళతారు. కానీ బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో వింత దొంగ తనం జరిగింది. పూర్తిగా స్టీల్లో నిర్మించిన ఐరన్ బ్రిడ్జిని దొంగలు ఎత్తుకెళ్లారు. 60 అడుగుల స్టీల్ వంతెన ఇది. అందునా పట్టపగలు ఈ వంతెనను దొంగిలించారని.. స్థానిక అధికారులకు, గ్రామస్థుల సహకారంతో ఉద్దేశపూర్వకంగా తొలగించారని అధికారులు అంటున్నారు. దొంగలు నీటిపారుదలశాఖ అధికారులం అని చెప్పి, గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మువర్ మిషిన్లు ఉపయోగించి మూడు రోజుల్లో మొత్తం వంతెనను కూల్చేశారని తెలిపారు. వారు ఈ వంతెన తొలగించడానికి స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు, గ్రామస్తుల సహకారం తీసుకోవడం ఆసక్తికరం. తర్వాత భారీగా ఐరన్ లూటీ చేసి దొంగలు పరారయ్యారని అధికారులు అర్థం చేసుకున్నారు.
1972లో నస్రిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావార్ గ్రామంలో అర్రాహ్ కెనాల్పై ఈ వంతెన నిర్మించారు. ఇప్పుడు ఆ వంతెన పూర్తిగా పాత పడిపోవడంతోపాటు ప్రమాదకరంగా మారింది. దాన్ని స్థానిక గ్రామస్తులు, చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు వాడటం మానేశారు. పక్కనే కొత్తగా నిర్మించిన వంతెనను వినియోగిస్తున్నారు.
తమకు నీటి పారుదలశాఖ విభాగం అధికారుల నుంచి ఫిర్యాదు అందిందని నస్రిగంజ్ ఎస్హెచ్వో సుభాష్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. దొంగలను గుర్తించడానికి స్కెచ్లు వేశామన్నారు. ఏదేనీ స్క్రాప్ మెటీరియల్ విక్రయించడానికి వచ్చే వారి సమాచారం ఇవ్వాలని స్క్రాప్ డీలర్లను ఆదేశించామన్నారు. ఈ వంతెన 60 అడుగుల పొడవు 12 అడుగుల ఎత్తు ఉంటుందని తెలిపారు.