ముంబై, (నమస్తే తెలంగాణ) : బీజేపీ కూటమి పాలిత మహారాష్ట్రలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బయటపడిన ఆదర్శ్ పథ్ పేడి రూ.202 కోట్ల కుంభకోణం మర్చిపోకముందే, ఆదర్శ్ మహిళా సహకార బ్యాంకులో రూ.60 కోట్ల మేరకు అమాయకులను మోసగించినట్లు వెల్లడైంది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఈ బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు కుమ్మక్కై నకిలీ పత్రాలు తనఖా పెట్టి శేంద్రే కమంగర్ గ్రామస్థుల పేరు మీద రుణాలు తీసుకున్నారు.
ఇందుకు గ్రామస్థుల ఆధార్, పాన్ నంబర్లను అక్రమంగా ఉపయోగించారు. పని చేయని ఫోన్ నెంబర్లను ఇచ్చారు. రుణం తీర్చాలని ఈ గ్రామానికి చెందిన 32 మందికి నోటీసులు రావడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. ఆదర్శ్ బ్యాంకుకు 23 ఏండ్ల నుంచి డైరెక్టర్గా ఉన్న నామ్దేవ్ దాదారావు కచ్ కురేను ఆదర్శ్ పథ్ పేడి స్కాంలో అరెస్టు చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు తిరిగి రాలేదని, పైగా తామే రుణం తీసుకున్నట్లు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించాలని నోటీసులు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.