జైపూర్: ఒక వ్యక్తి ఏకంగా 56 బ్లేడ్లు (Razor Blades) మింగాడు. తీవ్ర అస్వస్థత చెందడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్లు, కడుపులోని బ్లేడ్లను సర్జరీ ద్వారా బయటకు తీశారు. రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల యశ్పాల్ సింగ్, అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. అతడు ఉన్నట్టుండి ఒక దాని తర్వాత ఒకటిగా 56 బ్లేడ్లు మింగాడు. మూడు ప్యాకెట్లలోని బ్లేడ్లను మధ్యకు విరిచి కవర్తోసహా నోట్లో వేసుకుని మింగాడు. దీంతో నోటి నుంచి రక్తం రావడంతోపాటు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. గమనించిన రూమ్మేట్లు వెంటనే అతడ్ని మెడిప్లస్ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
కాగా, యశ్పాల్ సింగ్ను డాక్టర్లు పరిశీలించారు. సోనోగ్రఫీ పరీక్ష ద్వారా అతడి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎండోస్కోపీ నిర్వహించారు. కడుపు లోపల, మెడ భాగంలో కోసుకున్న గాయాలున్నట్లు గ్రహించారు. వెంటనే సర్జరీకి సిద్ధమయ్యారు. డాక్టర్ నర్సీ రామ్ దేవసి నేతృత్వంలో ఏడుగురు బృందంలో కూడిన వైద్యులు సర్జరీ నిర్వహించారు. మూడు గంటలు శ్రమించి 56 బ్లేడ్ ముక్కలను అతడి కడుపు నుంచి బయటకు తీశారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
మరోవైపు యశ్పాల్ సింగ్ ఆందోళన లేదా నిరాశ వల్ల మూడు ప్యాకెట్ల బ్లేడ్లు మింగి ఉంటాడని డాక్టర్ దేవసి తెలిపారు. బ్లేడ్లను విరిచి కవర్తో సహా మింగాడని చెప్పారు. కడుపులోకి వెళ్లిన తర్వాత బ్లేడ్ కవర్లు కరిగిపోవడంతో లోపలి భాగాలకు గాయమై రక్తం కారినట్లు వెల్లడించారు. కాగా, తమ కుమారుడు బ్లేడ్లు మింగిన విషయం తెలుసుకుని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతడు డిప్రెషన్తో బాధపడుతున్న సంగతి తమకు తెలియదన్నారు.
Also Read: