Internet Shutdown Policies | న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారత్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత(షట్డౌన్ల)పై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. షట్డౌన్లకు సంబంధించిన నియంత్రణ విధానాలను సమీక్షించాలని 105 దేశాలకు చెందిన 300కుపైగా సంస్థలు కేంద్రాన్ని కోరాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు బహిరంగ లేఖ రాశాయి. 2016 తర్వాత విధించిన ఇంటర్నెట్ షట్డౌన్లలో 56 శాతం భారత్లోనే విధించినట్టు ఈ సంస్థలు తెలిపాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత వల్ల ఆత్మీయులతో సంభాషించడానికి, బతుకు దెరువుకు, సమాచార మార్పిడికి, చదువుకోవడానికి, వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సంస్థలు వివరించాయి. రిపోర్టర్స్ వితౌవుట్ బోర్డర్స్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఇన్ ఇండియా తదితర పౌర హక్కుల సంస్థలు లేఖపై సంతకం చేశాయి.
సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవట్లే
ఇంటర్నెట్ సేవలపై సుప్రీం కోర్టు పలుమార్లు కేంద్రాన్ని హెచ్చరించింది. షట్డౌన్ విధించేటప్పుడు జవాబుదారీగా ఉండాలని, తగిన విధివిధానాలు పాటించాలని నిర్దేశించింది. తప్పనిసరి, వాయిదా వేయలేని పరిస్థితుల్లో మాత్రమే ఇంటర్నెట్ సేవలను నిలిపేయాలని స్పష్టం చేసింది.