Killer wolfs | ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో ఒంటరి తోడేలు (wolf) వరుస దాడులకు పాల్పడుతోంది. మొన్న రాత్రి ఓ 11 ఏళ్ల బాలికపై దాడి చేసిన తోడేలు.. ఇప్పుడు తాజాగా ఓ మహిళపై దాడి చేసి గాయపరిచింది.
ఖైరిఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాయ్పూర్ కొరేనా తెప్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పుష్పా దేవి అనే 50 ఏళ్ల మహిళపై దాడి చేసింది. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను వెంటనే బహరాయిచ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఆమె నిద్రిస్తున్నప్పుడు తోడేలు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా ఈ ఒంటరి తోడేలు 11 ఏళ్ల బాలికపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి మహసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కాగా, మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్ల (Killer wolfs) గుంపు గత రెండు నెలలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలచి వేస్తోంది. సుమారు 39 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను బంధించారు. మంగళవారం ఉదయం కూడా ఓ తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆరో తోడేలు కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒంటరిగా మిగిలిన ఆ తోడేలు వరుస దాడులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తోడేళ్లను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు. తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి, ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఈ తోడేళ్ల గుంపు దాడుల కారణంగా సుమారు రెండు నెలలుగా బహరాయిచ్లోని 35 గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. తోడేళ్ల దాడుల్ని ‘వైల్డ్లైఫ్ డిజాస్టర్’గా యూపీ సర్కార్ ప్రకటించింది.
Also Read..
Indore | ట్రైనీ ఆఫీసర్లను దోచేసి.. స్నేహితురాలిపై సామూహిక లైంగికదాడి
Devara | ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి.. బ్లడ్ క్యాన్సర్ బాధితుడి వేడుకోలు
Shashank Manu | 2 గంటల్లో 57 స్టేషన్లు చుట్టేశాడు.. మెట్రోలో ప్రయాణంతో గిన్నిస్ రికార్డు