చండీగఢ్: పంజాబ్, హర్యానా, రాజస్థాన్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోని 130 చోట్ల రైతులు రైల్ రోకో చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించడంతోపాటు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సోమవారం దేశ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాంతియుత రైల్ రోకో నిరసనకు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది.
అయితే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశాతోపాటు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రైతులు పలు రైల్వే స్టేషన్లలో రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో సుమారు 50 రైళ్లపై ప్రభావం చూపింది. పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లు పలు చోట్ల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఎక్కడా కూడా రైళ్లు ఆగలేదు. సాధారణ పరిస్థితులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. లక్నోలో 144 సెక్షన్ విధించారు.