ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీ వద్ద చాలా హృదయవిదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు హాస్పిటళ్లకు పోటెత్తుతున్నారు. చిన్న పిల్లలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, కొందరు డెంగీ పరీక్షలో పాజిటివ్గా తేలుతున్నట్లు పీడియాట్రిక్ డాక్టర్ ఎల్కే గుప్తా తెలిపారు. ప్రస్తుతం హాస్పిటల్లో 186 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ చంద్రా విజయ్ సింగ్ ఆదేశించారు. నిన్న ఫిరోజాబాద్ హాస్పిటల్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు.
చాలా మంది పిల్లల్లో.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, డీహైడ్రేషన్, మగత లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు పేషెంట్లలో కాళ్లు, చేతులకు ఎర్రటి దద్దులు వస్తున్నాయి. అయితే మరణించిన వారిలో ఎవరు కూడా కోవిడ్ పాజిటివ్గా తేలలేదు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న సమయంలో.. ఈ వింత జ్వరంతో ప్రజలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.
ఆగ్రా, మథుర, మెయిన్పురి, ఇటా, కస్గంజ్, ఫిరోజాబాద్ ప్రాంతాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్లేట్లెట్లు తగ్గడంతో పేషెంట్లు చాలా త్వరగా బలహీనంగా మారుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చాలా త్వరగా ప్రాణాలు కోల్పోతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.