ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సంపన్నుల వద్దే ఉన్నది. పేదలు మాత్రం మౌలిక అవసరాలనూ తీర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదే సమయంలో జీఎస్టీ వసూళ్లలో 64శాతం పేదలు కట్టిందే కావడం విస్మయపర్చే విషయం. ‘సర్వైవర్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఆక్స్ఫామ్ విడుదల చేసిన నివేదికలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.
దావోస్, జనవరి 16: దేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం 1 శాతం మంది వద్దే 40 శాతం సంపద పోగుబడినట్టు వెల్లడించింది. పేదల వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నది. అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో మూడింట రెండు వంతులు పేదలే చెల్లిస్తున్నారని వెల్లడించింది. సంపన్నులు చెల్లిస్తున్నది కేవలం 4 శాతమే అని తెలిపింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆక్స్ఫామ్.. ‘సర్వైవర్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో నివేదిక విడుదల చేసింది.
166కు చేరిన బిలియనీర్ల సంఖ్య..
ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం.. 2012- 2021 మధ్య భారత్లో సృష్టించిన సంపద 1 శాతం మంది చేతుల్లోకే వెళ్లింది. ఈ ఒక శాతం మంది గత రెండేండ్లలో సంపాదించిన ఆస్తి.. మిగిలిన జనాభా సంపాదించిన మొత్తం కన్నా రెట్టింపు. అడ్డుగున ఉన్న 50 శాతం మంది వద్ద కేవలం 3 శాతం సంపద ఉన్నది. ఒక్క 2022లోనే గౌతమ్ అదానీ సంపద 46 శాతం పెరిగింది. భారత్లో 2020లో 102 మంది బిలియనీర్లు ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 166కు చేరింది.
టాప్-100 కుబేరుల వద్ద 53.88 లక్షల కోట్లు..
ప్రస్తుతం టాప్ 100 సంపన్నుల వద్ద ఉన్న సంపద రూ.53.88 లక్షల కోట్లు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్కు 18 నెలలకు సరిపడుతుంది. నివేదిక విడుదల సందర్భంగా ఆక్స్ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తు ధనవంతులకు మాత్రమే దేశం అన్నట్టు భారత్ తయారవుతున్నది. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, అసంఘటిత రంగంలోకి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే అత్యంత ధనవంతులపై వెల్త్ ట్యాక్స్ విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి ఆక్స్ఫామ్ సూచించింది. ఆ ట్యాక్స్ను నేషనల్ హెల్త్ మిషన్కు మళ్లించాలని తెలిపింది.
ఈసారీ సంపద పైపైకే..
నైట్ ఫ్రాంక్ సర్వే
ఈ ఏడాదీ దేశంలోని అపర కుబేరుల సంపద పెరుగవచ్చని ఓ గ్లోబల్ సర్వేలో తేలింది. గత ఏడాది ప్రతీ 10 మంది భారతీయ అపర కుబేరుల్లో 9 మంది సంపద పెరిగింది. ఈ క్రమంలో ప్రస్తుత సంవత్సరం కూడా వీరి సంపద మరింత పెరుగవచ్చని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సర్వే వెల్లడించింది. ‘ది వెల్త్ రిపోర్ట్: ఔట్లుక్ 2023’ పేరుతో సర్వే వివరాలను నైట్ ఫ్రాంక్ తాజాగా విడుదల చేసింది. 2022లో 88 శాతం భారతీయ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివీడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూ) సంపదలో వృద్ధి కనిపించిందని, ఇందులో 35 శాతం మంది సంపద 10 శాతంపైనే ఎగిసిందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. అభద్రత, అస్థిరత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో సంపద పెరుగడం గొప్పేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సంపద పెరిగే అవకాశాలే ఉన్నట్టు చెప్పింది. సర్వేలో 47 శాతం భారతీయ అపర కుబేరుల్లో తమ సంపద నిరుడుతో పోల్చితే ఈ సంవత్సరం 10 శాతానికిపైనే పెరుగుతుందన్న విశ్వాసం కనిపించిందని, మిగతా 53 శాతం మందిలో కూడా కనీసం 10 శాతమైనా పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమైందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.