ముంబై: వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. (Labourers Suffocate To Death) అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నాగ్పాడలోని నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ భవనంలోని వాటర్ ట్యాంక్ను ఐదుగురు కూలీలు శుభ్రం చేశారు. అయితే ఊపిరాడక వారు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాటర్ ట్యాంకులో ఉండిపోయారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, అంబులెన్స్లు, బీఎంసీ వార్డు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊపిరాడక అచేతనంగా పడిపోయిన ఐదుగురిని వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు. అంబులెన్స్ల్లో జేజే ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు అప్పటికే నలుగురు కూలీలు మరణించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) ధృవీకరించారు. ఒక వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.